నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే బాలయ్యకు సన్నిహితుడైన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి బాలయ్యను అభినందించడానికి వచ్చారు. మాటల సందర్భంలో ఇలాంటి సమయంలో ఓ జానపద చిత్రం చేస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని ఇద్దరు భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్ చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. దర్శకుడుగా కోడి రామకృష్ణను అనుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య ప్రతాప వర్మ, విక్రమ సింహ భూపతి అనే రెండు క్యారెక్టర్లలో నటిస్తాడు. బాలయ్య ఓ అడవిలో తన నానమ్మతో కలిసి ప్రతాప్ వర్మ క్యారెక్టర్ లో ఉంటాడు. అయితే కొందరు బందిపోటు దొంగలు ఆ గ్రామాన్ని దోచుకోవడానికి వస్తారు. ఆ సమయంలోప్రతాప వర్మను చూసి వారు సాష్టాంగ నమస్కారం చేస్తారు.
అప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. బాలయ్య ఎవరో కాదు ఆ సామ్రాజ్యానికి యువరాజు బాలయ్య తండ్రి విక్రమ సింహ భూపతి ఆ సామ్రాజ్యానికి మహారాజు. అయితే కొందరు వెన్నుపోటు పొడిచి విక్రమ సింహ భూపతిని చంపేస్తారు. అప్పుడు బాలయ్యను తీసుకుని అతడి నానమ్మ ఓ గూడానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ వర్మ తన తండ్రి మరణానికి కారుకులైన వారిని అంతం చేసి తిరిగి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్న కథాంశంతో ఈ సినిమాను అనుకున్నారు.
అయితే ఇందులో చాలా మలుపులు, ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరోయిన్గా సీనియర్ బాలయ్యకు జోడిగా రోజాను ఎంపిక చేశారు. అలాగే జూనియర్ బాలయ్య కు జోడిగా టక్కరి దొంగ సినిమా హీరోయిన్ లిసా రాయ్ ను అనుకున్నారు. అయితే లిసా ప్లేస్ లోకి అంజలా జవేరి వచ్చి చేరింది. 2001లో రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2002 సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. దాదాపు సగం వరకు సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీ లో రెండు పాటలు కూడా చిత్రీకరించారు.
అయితే ఒక సిద్ధాంతి నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డితో ఈ సినిమా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావని చెప్పారట. అనుకున్నట్టుగానే బాలయ్య మధ్యలో సీమ సింహం సినిమా కోసం కొద్ది రోజులు పాటు గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో బాలయ్యకు నానమ్మగా నటిస్తున్న భానుమతి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కొద్దిరోజులపాటు సినిమా ఆగిపోయింది. తర్వాత నిర్మాత గోపాల రెడ్డికి సైతం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వచ్చాయి.
అలా ఈ సినిమాను మధ్యలో వదిలేశారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి మృతి చెందడంతో ఈ సినిమా అలా మధ్యలోనే ఆగిపోయింది. ఏదేమైనా అప్పట్లో ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించి ఉన్నట్లయితే బాహుబలిని మించి గొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోయి ఉండేదని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాను అప్పట్లో 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే పెద్ద సంచలనం అనుకున్నారు. అయితే విక్రమ సింహ భూపతి సినిమాకు అంతకుమించి భారీ బడ్జెట్ పెట్టేలా ప్లానింగ్ చేశారు. ఏదేమైనా ఇంత గొప్ప సినిమా రిలీజ్ కాకుండా మధ్యలో ఆగిపోవడం దురదృష్టకరం.