రాజకీయాల్లో నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయకులు.. అతిశయంగా వ్యవహరిం చే నాయకులు మెండుగా కనిపిస్తారు. దీనివల్ల సదరు నాయకులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విషయాలు పక్కన పెడితే.. పుంజుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు. ఈ రెండు విషయాలను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్లో బరిలో ఉన్న మంత్రి విడదల రజనీ.. భిన్నంగా కనిపిస్తారు. ఆమె రాజకీయాల్లోకి వచ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియర్లకు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తారనే పేరు తెచ్చుకున్నారు.
చిలకలూరి పేట రాజకీయ దిగ్గజం ప్రత్తిపాటి పుల్లారావును ఓడించడం నుంచి.. నియోజకవర్గంలో బల మైన నాయకురాలిగా ఎదగడంలో రజనీ పాత్ర విస్మరించలేం. వైసీపీ దన్ను ఉన్నప్పటికీ.. అనేక మంది నాయకులు విఫలమయ్యారు. కానీ, రజనీ వారిలా కాకుండా.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారు. అంతేకాదు.. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలు.. రాజకీయంగా చతురత వంటివి కలిసివచ్చాయి.
ఇక, ఆ తర్వాత.. నియోజకవర్గం మార్పు సూచించినా.. ఆమె వెనుకడుగు వేయలేదు. తనకు సంబంధం లేని గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయాలని పార్టీ చెప్పగానే.. ఓకే చెప్పిన మహిళా నాయకురాలు. అయిష్టంగా కాదు.. ఇష్టంగానే గుంటూరు వెస్ట్లో అడుగు పెట్టారు. ప్రజలను మమేకం చేసుకున్నారు. మంత్రిగా తాను చూపిన చొరవను వివరించారు. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో చెబుతున్నారు. ఫలితంగా.. నియోజకవర్గంలో సొంత మనిషి అనేలా ఆమె దూసుకుపోతున్నారు.
ఇక్కడ ప్రధానంగా రజనీకి కలిసి వస్తున్న రాజకీయం వినయం. పార్టీ పట్లే కాదు.. ప్రజల పట్ల కూడా ఎంతో విధేయతగానే ఉంటున్నారు. నేను మంత్రిని అనే అహం ఆమెలో ఎక్కడా కనిపించదు. ఎవరు వెళ్లినా నవ్వుతూ పలకరించే తత్వం.. సమస్యలు వినే ఓపిక వంటివి సామాన్యులకు ఇట్టే కనెక్ట్ చేశాయి. ఇక, పార్టీలోనూ.. ఆమెకు శత్రువులు లేకపోవడం మరింతగా ఆమెకు మెరుగు పెడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. అతి లేని.. అతిశయం లేని నాయకురాలిగా గుంటూరు వెస్ట్లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటుండడం గమనార్హం.