తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘనవిజయం సాధించింది. నిన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా గెలవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాలకు ముగిసింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది.
48 డివిజన్లలోను టీడీపీ 32 డివిజన్లు, మిత్రపక్షమైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబల్ అభ్యర్థులు 3 డివిజన్లలో విజయం సాధించారు. 30 సంవత్సరాల తర్వాత కాకినాడ కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగిరింది. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకుల ఆనందానికి అవధులే లేవు.
ఈ గెలుపుపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ విజయం సీఎం చంద్రబాబుకే అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని చినరాజప్ప జోస్యం చెప్పారు.