తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఏకపక్ష విజయం సాధించింది. నంద్యాలలో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ కాకినాడలో కూడా సైకిల్ బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. వార్ వన్సైడ్ చేసేసి విజయం సాధించింది. ఇక్కడ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ఇచ్చిన 9 సీట్లలో సరిగా పెర్పామ్ చేయలేకపోయింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్యే స్వయంగా వైసీపీ చేతిలో ఓడిపోయారు.
ఇక ఇక్కడ టీడీపీ ఏకపక్ష విజయం సాధించినా ఆ పార్టీకి రెండు మైండ్ బ్లాక్ అయ్యే షాకులు తగిలాయి. 22వ డివిజన్లో కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే కొండబాబు అన్న కుమారుడు శివప్రసాద్ ఓడిపోయారు. ఇదే 22వ డివిజన్లో కిశోర్కుమార్ (వైసీపీ) విజయం గెలుపొందడం గమనార్హం. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరితోనే ఈ చేదు అనుభవం చూడాల్సి వచ్చింది.
ఇక టీడీపీకి మరో షాక్ ఏంటంటే ఆ పార్టీ టిక్కెట్లు ఇవ్వని ముగ్గురు రెబల్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటాపోటీనిచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు డివిజన్లలో గెలుపొందారు. 35వ డివిజన్లో బి. రామకృష్ణ (ఇండిపెండెంట్), 29వ డివిజన్లో వాసిరెడ్డి రాంబాబు (ఇండిపెండెంట్) గెలుపొందారు. 39 నాగసూర్యదీపిక (ఇండిపెండెంట్) గెలిచారు. వీరు ముగ్గురు టీడీపీ రెబల్ అభ్యర్థులు కావడం విశేషం. దీంతో కాకినాడలో టీడీపీ వార్ వన్సైడ్ చేసినా ఈ రెండు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.