కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు అధికమవుతున్నాయి. ఈ విషయం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్నూలు పేరు మరింతగా అందరికీ వినిపించినా.. ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే తరహా కోల్డ్వార్ నడిచింది. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. రెండు వర్గాల మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేశారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్! ఒక వర్గానికి ఎమ్మెల్సీ సీటు, మరో వర్గానికి మంత్రి పదవి సీటు కేటాయించి అసంతృప్తి నేతలను చల్లార్చారు.
అద్దంకిలో గొట్టిపాటి, బలరం వర్గాల మధ్య కొన్ని రోజులుగా సంధి కుదిర్చేందుకు టీడీపీ పెద్దలు తెగ ఆపసోపాలు పడ్డారు. చివరకు రాజీమార్గాన్ని తెచ్చేందుకు ఒక వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగానే బలరాంకి ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కిందని తెలుస్తోంది. అలాగే గొట్టిపాటి రవికుమార్ వర్గానికి వచ్చే ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
వైసీపీ నుంచి టీడీపీ చేరి మంత్రి పదవి పొందే వారి జాబితాలో గొట్టిపాటి పేరు కూడా వినిపిస్తోంది. అయితే వైసీపీలో ఉన్న సమయంలో, టీడీపీలో చేరే సమయంలోనూ, బలరాం వర్గం గొడవలు పడిన సందర్భంలోనూ రవి వ్యవహరించిన తీరు చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా ఆకట్టుకుందట. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇదే సమయంలో బలరాం వర్గం ఆగ్రహం వ్యక్తంచేయకుండా ఉండేందుకు, ఆయన వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బలరాం, ఆయన కొడుకు వెంకటేశ్ను పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారట చంద్రబాబు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వెంకటేశ్కు ఏదో ఒక సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చారట. ఇక అద్దంకిలో ఎటువంటి గొడవలు రాకూడదని స్పష్టంగా చెప్పారట. అయితే తనకు ఎమ్మెల్సీ, తన కొడుక్కి ఎమ్మెల్యే ఇస్తామని అధినేత మాటిచ్చే సరికి.. బలరాం ఉబ్బితబ్బిబ్పై పోయారట. మరి దీని వెనుక అసలు రీజన్ తెలిస్తే.. ఎలా స్పందిస్తారో ఏమో!!