టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్టు అయ్యారు. వందలాది మందిని మోసం చేశారని ఆరోపణలతో వారు పెట్టిన కేసులను పోలీసులు పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు కట్టి నారాయణరావును అరెస్ట్ చేసిన సంఘటన ఇండస్ట్రీలో కలకలం రేపింది. గర్ల్ ఫ్రెండ్, నీది నాది ఒకే కథ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నారాయణరావు ఎస్ఎంసిజి సంస్థ పేరిట పలువురిని మోసం చేసినట్లుగా ఆరోపణలు తలెత్తాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాంబాబు అని పోలీసులు వెల్లడించారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మోసం సినీ నిర్మాతకు నేరుగా సంబంధం లేకపోయినా.. అతను చేసిన పనికి అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో ఒక ఎస్ఎంసిజీ సంస్థను స్థాపించిన రాంబాబు.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎక్కువ వడ్డీని ఆశ చూపించి వందలాది మందిని మోసం చేశాడు. ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ మోసం దాదాపు రూ.540 కోట్లుగా తెలుస్తోంది. తాజాగా సంస్థ బోర్డును తిప్పేయడంతో బాధితులంత ఆయనపై పెద్ద ఎత్తున పిర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా.. ఓ సిఏ హెల్ప్ తో రాంబాబు సినీనిర్మాత అయిన అట్లూరి నారాయణను కలిసి తను ఉన్న పరిస్థితిని వివరించాడు.
దానికి రియాక్ట్ అయిన అట్లూరి తనకున్న పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడట. ఇందుకుగాను అన్ని ఖర్చులతో కలిపి రూ.20 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అతనిని అడిగినట్టు.. డీల్ చివరికి రూ.2కోట్లకు తెగిందని తెలుస్తుంది. దీంతో అడ్వాన్స్ పది లక్షలు అట్లూరి నారాయణకు చెల్లించాడట రాంబాబు. దీనికి తోడు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణం కూడా ఇచ్చాడట. ఈ బంగారు ఆభరణాన్ని తీసుకున్న అట్లూరి కరిగించేసి రూ.90 లక్షలకు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విషయం మొత్తాన్ని బయటకు రాబట్టారు. నారాయణరావు హస్తం కూడా ఇందులో ఉందని తెలుసుకున్న పోలీసులు అతని కూడా అరెస్ట్ చేసి కోటు ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్ట్ను.. అదనపు విచారణ కోసం కస్టడీకి చేర్చవలసిందిగా పోలీసులు కోరారు. దీనికి కోర్ట్ సానుకూలంగా స్పందించింది. వీరిద్దరినీ కస్టడీకి తీసుకున్న తర్వాత ఆ కరిగించిన బంగారం మొత్తాన్ని రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారట.