లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది.
టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది. ఈ క్రమంలోనే గన్నవరంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభలోనే వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుని టిడిపిలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి దూరమైన యార్లగడ్డ..తాజాగా చంద్రబాబుని కలిశారు. ఇక పార్టీ ఏది చెబితే అది చేస్తానని..ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు గన్నవరంలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన టిడిపిలో చేరుతున్నారు.
ఇక టిడిపిలో చేరిన వెంటనే..ఆయన్ని గన్నవరం ఇంచార్జ్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో వంశీ వైసీపీ నుంచి, యార్లగడ్డ టిడిపి నుంచి పోటీ చేయడం ఖాయం..గత ఎన్నికల్లో రివర్స్ లో పోటీ చేశారు..వంశీ విజయం సాధించారు. ఇప్పుడు పోరు రసవత్తరంగా సాగడం ఖాయమే. ఇప్పుడున్న పరిస్తితుల్లో గన్నవరంలో వైసీపీ, టిడిపి బలమైన పార్టీలే..బలమైన కేడర్ ఉంది. కాకపోతే కొంత టిడిపి కేడర్ వంశీతో పాటు వైసీపీలోకి వెళ్లింది.
వంశీకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ..అధికారం, ఆర్ధిక బలం ఉంది. ఇటు వంశీతో పోలిస్తే యార్లగడ్డకు ఫాలోయింగ్ తక్కువే. కాకపోతే వంశీతో పడని వైసీపీ కేడర్ యార్లగడ్డ వైపుకు వస్తుంది. అదే సమయంలో బలమైన టిడిపి కేడర్, ఆర్ధికంగా బలంగా ఉండటం యార్లగడ్డకు ప్లస్. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.