నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష పెళ్లి పీటలెక్కాడు. సాయి గీతిక అనే యువతితో ఏడడుగులు వేశాడు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీహర్ష, గీతికల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావుతో సహా ఎందరో ప్రముఖులు సుహాసిని తనయుడి పెళ్లిలో సందడి చేశారు.
మేనల్లుడి వివాహంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సొంత అక్క కుమారుడి పెళ్లి కావడంతో.. అన్నీ తామై చూసుకున్నారు.
అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఎన్టీఆర్, కళ్యాణ్ ఫోటోలకు పోజులిచ్చారు. వీరు రాయల్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు అన్నదమ్ములను చూసి నందమరి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం శ్రీహర్ష, గీతికల వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.