బ్రో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. తమిళ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదలైంది.
ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. రూ. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. పవన్ కళ్యాణ్ మ్యానియాతో రూ. 67 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బ్రో థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. దాదాపుగా రూ. 30 కోట్లకు పైగా ఈ చిత్రానికి నష్టాలు వాటిల్లాయి.
అయితే బిగ్ స్క్రీన్ పై అలరించకపోయినా.. కొన్ని సినిమాలు ఓటీటీలో హిట్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే బ్రోను నెల తిరక్క ముందే ఓటీటీలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ అయింది. బ్రో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రానికి ఆగస్టు 25న స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.