పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సిఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు.
పవన్ సిఎం పదవి వద్దంటే..తాము ఓటు నోటాకు వేస్తామని మాట్లాడారు. అటు వైసీపీ సైతం..పవన్..బాబుకు ఊడిగం చేస్తున్నారని, బాబుని సిఎం చేయడానికే పవన్ ఉన్నారని, కాపుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేశారు. ఈ విమర్శల ప్రభావం పవన్కు కాస్త ఇబ్బందిగానే మారయని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఇలా మాట్లాడటం వల్ల పొత్తులు ఉన్న సరే ఓట్లు పూర్తి స్థాయిలో పడవని అర్ధమైంది. అందుకే పవన్ పొత్తులపై రూట్ మార్చారు. వాటి గురించి ఎన్నికల వచ్చినప్పుడు చూసుకుందామని, ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు.
అందుకే మొదట తనకు సిఎంగా ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సరిగ్గా పాలన చేయకపోతే తనంతట తానే తప్పుకుంటానని అంటున్నారు. అంటే పొత్తులతో సంబంధం లేకుండా తానే సిఎం అంటున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో జోష్ నెలకొంది. అయితే ఇదంతా ఒక స్ట్రాటజీ అని తెలుస్తుంది. అటు చంద్రబాబు సైతం తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందుకెళుతున్నారు.
ఈ అరాచక పాలనకు చెక్ పెట్టి..టిడిపి ప్రభుత్వం వస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అంటే ముందు బాబు, పవన్..తమ పార్టీలని బలోపేతం చేసుకుంటున్నారు. తమ ఓటు బ్యాంకుని బలంగా మార్చుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకుని..అప్పుడు మిగతా విషయాలు తేల్చుకునే అవకాశాలు ఉన్నాయి.