దివంగత మహా నాయకుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. ఆయన కుటుంబం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ తరఫున కూడా.. భారీ ఎత్తున మహానాడు ను నిర్వహిస్తున్నారు. అయితే.. టీడీపీ చేస్తున్న విషయం పక్కన పెడితే.. ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా ఇప్పుడు అన్నగారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇది అధికారిక కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనకపోయినా.. ఆయన సందేశాన్ని మాత్రం చదివి వినిపించ నున్నారు. ఇక, నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళారత్న అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ వేదికపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కూడా మెరవ నున్నారు. అయితే.. గత ఏడాది లేని ఈ కార్యక్రమం ఈ ఏడాది నిర్వహించడం.. ప్రాధాన్యం సంతరిం చుకుంది.
పైగా.. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వంలోనూ చర్చ సాగలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందుకూడా దీనిని అనుకోలేదు. కానీ, అనూహ్యంగా.. హఠాత్తుగా.. అన్నగారి కార్యక్రమాన్ని తెరమీదికి తెచ్చారు. రాత్రికి రాత్రి హడావుడిగా .. ఆహ్వాన పత్రికలు రెడీ చేశారు. వాటిలో ఎన్నోతప్పులు ఉన్నప్పటి కీ.. ఎవరూ పట్టించుకోలేదు. సరే..అసలు ఇంత హడావుడగా ఎందుకు.. ఈ కార్యక్రమం చేస్తున్నారనేది ప్రశ్న.
దీనిని పరిశీలిస్తే.. విజయవాడలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా.. వైసీపీ కూడా.. ఎన్టీఆర్ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలోవైసీపీ చాలా పెద్ద వ్యూహాన్నే రచించిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నగారి అభిమానులను, గ్రామీణ ఓటు బ్యాంకును కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇలా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.