వెండితెరపై కళాత్మక దృశ్యకావ్యాలను చెక్కిన దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్. నిత్య సంధ్యావంద నాది క్రతువులు.. నిప్పులు కడిగే ఆచారం ఉన్న సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విశ్వనాథ్.. బీఎస్సీ వరకు చదువుకున్నారు. తర్వాత అనూహ్యంగా ఆయన చిత్ర పరిశ్రమవైపు అడుగులు వేశారు. తొలినాళ్లలో సాంఘిక చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన.. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పరిచయంతో కొత్త పుంతలు తొక్కారు.
“మనలో కళ ఉండొచ్చు. కవితాత్మక దృష్టి కోణం కూడా ఉండొచ్చు. కానీ, దీనికి మెరుగులు దిద్దాలనే తపన ఉన్న నిర్మాత దొరకడమే కష్టం. నేనొకటడుగుతాను చెప్పండి. డిస్కోడ్యాన్సులు చూసేందుకు ఎగబడుతు న్న ప్రేక్షకులు ఉన్న నేటి రోజుల్లో(1980లలో) నేను భరత నాట్యం కూచి పూడి వంటివి చూపిస్తానంటే.. ఏ నిర్మాతైనా సాహసం చేయగలరా? లక్షల రూపాయలు అప్పులు చేసి తెచ్చి.. నన్ను నమ్మగలరా.. వాళ్లకూ పది రూపాయలు లాభం చూసుకుంటారు. కానీ, నా అదృష్టం.. ఏడిద వంటి వారు దొరికారు“ అని వినమ్రంగా చెప్పుకొన్న కళాత్మక దర్శకుడు.. తపస్వి విశ్వనాథ్.
శంకరాభరణం చిత్రం ఆయన జీవితంలోనే కాదు.. అనేక మంది జీవితాలను మలుపు తిప్పిన అజరామర దృశ్యకావ్యం. ఈ సినిమాలో నటించిన వారు అనేక మంది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు సాధించినా.. వాటి గురించి వారు ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం తాము నటించిన శంకరాభరణం గురించే చెప్పుకొనేవారు. సిల్వర్ స్క్రీన్పై అదొక ఆస్కార్ను మించిన సినిమా! ఈ ప్రపంచంలో దానికి సాటిరాగల మేటి చిత్రం లేదని సగర్వంగా చెప్పుకొనేవారు.
ఈ నేపథ్యంలోనే శంకరాభరణం చిత్రం తర్వాత.. పలువురు నటులు `కే. విశ్వనాథ్.. పక్కన్నేను` అని చెప్పుకొనేందుకు.. ఉవ్విళ్లూరారు. శోభన్బాబు సహా వెంకటేష్ వంటి.. అనేక మంది యువ నటులతో విశ్వనాథ్ కళాఖండాలను రూపొందించారు. స్వర్ణకమలం ఈ పరంపరలోనిదే! ఇప్పుడు ఒక శకం ముగిసిందని భావిస్తున్నా.. తపస్వి ఎప్పుడూ.. మన మధ్యే.. `నాదశరీరాపరుడై` నాలుకలమీద నృత్యం చేస్తారనడంలో సందేహం లేదు.