ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్కరోజు వ్యవధిలో విడుదలైన ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తున్నాయి.
ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలైన 6 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తుచిత్తు చేసి లాభాల బాట పట్టింది. రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. విడుదలైన ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 75.01 కోట్ల షేర్, రూ. 121.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 91.41 కోట్ల షేర్, రూ. 157.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. దీంతో ఇప్పుడీ చిత్రం రూ. 2.41 కోట్ల లాభాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టడీగా దూసుకెళ్తోంది.
ఇక వీర సింహారెడ్డి విషయానికి వస్తే.. మొదటి వారాన్ని ఈ చిత్రం సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సంక్రాంతి బరిలోకి దూకిన ఈ చిత్రం.. మొదటి వారం పూర్తి అయ్యే సమాయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 58.51 కోట్ల షేర్, రూ. 94.65 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్గా రూ. 68.51కోట్ల షేర్, రూ. 114.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇంకా రూ. 5.49 కోట్ల రేంజ్ లో షేర్ను అందుకుంటే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుంది.