2019 ఏపీలో ఎన్నికల నామ సంవత్సరం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నికల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే థీమ్తో ఇటీవల ఆయన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక, ప్రశ్నిస్తానంటూ ప్రజాప్రస్థానంలోకి అడుగు పెట్టిన జనసేనాని పవన్ పార్టీకి 10 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చేశారు. దీంతో ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి పవన్ దగ్గరకు వెళ్లింది.
అరె.. ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. కేవలం 10 సీట్లు.. 13 % ఓట్లేనా? అని కంగుతిన్న జనసేనాని.. వెంటనే ఆయన కూడా సర్వే బాట పట్టారట. ఢిల్లీ కి చెందిన ఫ్లాష్ సర్వేకి ఈ సర్వే బాధ్యతలు అప్పగించారట. దీంతో వాళ్లువెంటనే రంగంలోకి దిగిపోయి.. కొన్ని ప్రశ్నలతో ఓ జాబితా తయారు చేసి.. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేశారు. ఈ సర్వే ప్రకారం వాళ్లు కొన్ని లెక్కలు కట్టేశారు. దీని ప్రకారం పవన్ పార్టీ జనసేనకి 41% ఓట్లు 21 సీట్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతం ఓ కాల్ సెంటర్ ద్వారా వాళ్లు సర్వే వివరాలు సరిచూసుకున్నట్టు సమాచారం. ఇక, ఈ సర్వేలో ప్రస్తుత సీఎం బాబు పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టడంతోపాటు జగన్ విపక్ష నేతగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడని తేలడం గమనార్హం. 131 పేజీల ఈ సర్వే పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీకి 45% ఓట్లు 101 సీట్లు
వైసీపీకి 31 % ఓట్లు 40 సీట్లు
జనసేనకి 41% ఓట్లు 21 సీట్లు
కాంగ్రెస్కి 4% ఓట్లు 4 సీట్లు
బీజేపీ లెఫ్ట్ పార్టీలకు 6% ఓట్లు 9 సీట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, ఇక్కడే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రజలు. పవన్ పార్టీపై పూర్తిస్థాయిలో ఇంకా నమ్మకం కుదరలేదని స్పష్టమైంది. జనసేన కూడా మరో ప్రజారాజ్యం అవుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా జగన్ కలలు ఇప్పట్లో నెరవేరని మరికొందరు కుండబద్దలు కొట్టారు. ఇక, జాతీయ పార్టీ కాంగ్రెస్కు ఈ సారి ఓట్లు వేయాలని కొందరు నిర్ణయించారు. ఇక, ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్న ముద్రగడ కన్నా.. పవన్కే ఆ వర్గం వాళ్ల మద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే తేల్చి చెప్పడం గమనార్హం. మొత్తానికి ఈ ఫలితాలు అధికారికంగా వెలువడకపోయినా.. ప్రస్తుత పొలిటికల్ ట్రండ్పై ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.