వైఎస్.జగన్ కాంగ్రెస్ను వీడి వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోటి వెంట నేనే సీఎం అనే పదం కొన్ని వేల సార్లు వచ్చి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వైఎస్.జగన్ ఆ టైంలో కూడా కాబోయే సీఎం నేనే…అనే డైలాగ్ కంఠోపాటంతో పదే పదే వల్లవేశారు. తర్వాత గత ఎన్నికలకు ముందు కూడా కొన్ని వేలసార్లు జగన్ నోటి వెంట అదే రొటీన్ డైలాగ్…ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి జగన్ విపక్షానికి పరిమితమయ్యారు. అయినా జగన్ తీరు మాత్రం మారలేదు..నేను సీఎం అవుతాను వచ్చే ఎన్నికల్లో అధికారుల అంత చూస్తానడం ఆయనకు పరిపాటి అయ్యింది.
వైజాగ్ ఎయిర్పోర్టులో అధికారులను కాబోయే సీఎం మీద చేయివేస్తున్నావ్ అంటూ అడ్డుకున్న జగన్ వీలున్నప్పుడల్లా అదే చెపుతున్నాడు. తాజాగా తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో లింగాల మండల అధికారుల సమీక్షలో సైతం జగన్ మరోసారి అదే పాట పాడారు. పోనీ జగన్కు ఈ డైలాగ్ వల్ల కొత్తగా కలిసొచ్చేది, ప్రజల్లో ఇమేజ్ మైలేజ్ ఏమైనా వస్తున్నాయా ? అంటే పూర్తి మైనస్సే తప్పా ఈ డైలాగ్ వల్ల ఆయనకు కలిసొచ్చేదేమి లేదన్నది సత్యం. అయినా ఈ డైలాగ్కు మాత్రం జగన్ బ్రేక్ వేయట్లేదు.
జగన్ వైసీపీ స్థాపించినప్పుడు ఓదార్పు యాత్ర అంటూ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగారు. ఇక ప్రజా సమస్యల విషయంలో కూడా జగన్ చేస్తోన్న ఫైటింగ్కు ఆయనకు ఎంతో మైలేజ్ దక్కి ఉండాలి. వాస్తవంగా ప్రజలతో ఎక్కుడ టైం స్పెండ్ చేసిన నేటి తరం నాయకులు ఎవరన్న ప్రశ్నకు డేటా తీస్తే అందులో జగన్ ఫస్ట్ ప్లేసులో ఉంటాడు. అయితే జగన్ ఎక్కడకు వెళ్లినా నేనే సీఎం అన్న డైలాగ్ చెపుతుండడంతో అటు ప్రజల్లోను ఇటు అధికారుల్లోను ఆయనకు ప్రజలు, వారి సమస్యలు పట్టవు అన్న నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
షాక్ ఏంటంటే నేనే సీఎం డైలాగ్ను నిన్నటి వరకు హైలెట్ చేసిన సాక్షి ఇప్పుడు జగన్ మాట్లాడుతోన్న నేనే సీఎం డైలాగ్ ఒక్క మాట తప్ప ఆయన మిగిలిన ప్రసంగం మొత్తం రాస్తోంది. దీనిని బట్టి జగన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటాడేమో చూడాలి.