ఏపీ రాజధాని అమరావతి కోసం వచ్చే నాలుగేళ్లలో ఖర్చు చేయాలని భావిస్తున్న డబ్బెంతో తెలిస్తే.. షాకే! ఒక వెయ్యి కోట్లు కాదు పది వేల కొట్లు కాదు ఏకంగా 32 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఏ పని సాకారం కావాలన్నా డబ్బుతోనే పని. అలాంటిది ఏమీలేని చోట అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అమరావతి వంటి అధునాతన నగరాన్ని నిర్మించాలంటే నిధులను నీళ్లలా పారించకతప్పదు.
ఇప్పుడు ఈ విషయంలోనే అమరావతికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చేసింద. రానున్న నాలుగేళ్లలో సుమారు 32,500 కోట్లను అమరావతి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ నిధులతో రహదారులు, భవన నిర్మాణాలు, ఇళ్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున నిధులనైతే కేటాయించారు కానీ, ఇంత మొత్తం ప్రభుత్వం దగ్గర లేదు కదా? అందుకే ఇప్పుడు అధికారులు నిధుల వేటలో పడ్డారని తెలిసింది.
తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల నుంచి నిధులు అప్పుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఇక, ఇది నాలుగేళ్ల ప్రణాళిక అయితే, రానున్న పదేళ్లలో మరో 43 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్లాన్ చేసిందట. మరోపక్క, అంతర్జాతీయ విద్యాసంస్థలు, దేశంలోని టాప్ టెన్ సంస్థలు అమరావతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అదికారులను కోరారు. వచ్చే 15 సంవత్సరాలలో అమరావతిని మెగాసిటీగా చేయడానికి వీలుగా చర్యలు చేపట్టాలని కూడా పక్కా ప్లాన్తోముందుకు దూసుకు పోతున్నారన్నమాట.