ఎలాంటి సినీ బ్యాక్గ్రౌంట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ నటుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ప్రస్తుతం ఈయన `టైగర్ నాగేశ్వరరావు` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. స్టూవర్ట్పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కు వంశీ దర్శకత్వం వహించాడు.
నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తే.. రేణుదేశాయ్, అనుపమ్ఖేర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మేకర్స్ జోరుగా ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అభిషేక్ అగర్వాల్.. రవితేజ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
ఈ సినిమాలో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులతో ట్రైన్ దోపిడీ సీన్ షూట్ చేస్తుండగా.. రవితేజ అదుపు తప్పి కింద పడ్డారట. దాంతో ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ను హాస్పటల్ కు తీసుకెళ్లగా.. ఆపరేషన్ చేసి 12 కుట్లు వేశారట. అంత పెద్ద గాయం అయినా కూడా తగ్గేదేలే అంటూ రవితేజ రెండు రోజుల్లో మళ్లీ షూటింగ్ కు వచ్చారట. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని డైరెక్టర్ ఎంత చెప్పినా సరే.. నిర్మాతలకు బడ్జెట్ పెరిగిపోతుందని ఆలోచించి వెంటనే షూట్ లో జాయిన్ అయ్యారట. ఇది రవితేజ డెడికేషన్ కు ఒక నిదర్శనమంటూ తాజాగా అభిషేక్ అగర్వాల్ ఈ విషయాన్ని బయపెట్టారు.