ఇంతకాలం పరోక్షంగా కలిసి ఉంటూ..ఒకరికొకరు సాయం చేసుకున్న వైసీపీ, బిజేపిలు ఇప్పుడు..ప్రత్యర్ధులుగా మారిపోయాయి. తాజాగా ఏపీకి అమిత్ షా, జేపి నడ్డా వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు. ఇక వారికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. టిడిపితో కలిసి బిజేపి గతంలో అవినీతికి పాల్పడిందని, టిడిపి చెప్పినట్లే బిజేపి నేతలు చెబుతున్నారని అంటున్నారు. ఇటు బిజేపి నేతలు కూడా వైసీపీకి కౌంటర్లు వేస్తున్నారు.
ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే బిజేపికి టిడిపితో లింక్ చేసి వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇలా చేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. మొదట ఏపీలో బిజేపిపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మొన్నటివరకు వైసీపీకి అండగా ఉండటం వల్ల..ఆ వ్యతిరేకత వైసీపీపై పడింది. ఇప్పుడు బిజేపి వ్యతిరేకత టిడిపికి వెళ్ళేలా చేయడానికి వైసీపీ నేతలు కష్టపడుతున్నారు. అదే ప్లాన్ తో టిడిపి, బిజేపి ఒక్కటే అని విమర్శలు చేస్తున్నారు.
అంటే టిడిపిపై యాంటీ పెంచడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ పార్టీల మధ్య అటువంటి పరిస్థితి ఉండబోదని, పోటీనే ఉంటుందని, విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, వైసిపి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని అన్నారు.
అంటే టిడిపి, బిజేపి పొత్తు ఉంటుందనే ప్రచారం తెస్తున్నారు. దీని వల్ల బిజేపి వ్యతిరేకత టిడిపికి వెళుతుందనే ప్లాన్. కానీ బిజేపితో పొత్తు ఎట్టి పరిస్తితుల్లో ఉండదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. బిజేపితో పొత్తు పెట్టుకోవద్దని వారు కోరుతున్నారు.