నాటి మేటి అందాల తార జయప్రద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తమిళ అగ్ర దర్శకులలో ఒకరైన కే. బాలచంద్రన్ తెరకెక్కించిన అంతులేని కథ, తెలుగు కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన సిరిసిరి మువ్వా సినిమాలతో జయప్రద తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆమెను స్టార్ హీరోయిన్గా చేసింది మాత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు సినిమా అనే చెప్పాలి. నటరత్న ఎన్టీఆర్ తో జయప్రద నటించిన తొలి సినిమా కూడా ఇదే కావటం మరో విశేషం. 1977లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఆ తర్వాత మళ్లీ అదే సంవత్సరం ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన చాణక్య చంద్రగుప్త అంతేకాకుండా మా ఇద్దరి కథ, యమగోల వంటి పలు సినిమాలలో ఎన్టీఆర్ కు జంటగా జయప్రద నటించి అలరించారు. దాంతో ఎన్టీఆర్- జయప్రద హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి సినిమా సూపర్ మాన్ ఈ సినిమా తర్వాత జయప్రద మళ్లీ ఎన్టీఆర్ తో నటించక పోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆ టైంలో ఎన్టీఆర్ తో సమానంగా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణతో జయప్రద పలు సినిమాలలో నటించారు. కృష్ణతో కలిసి విజయనిర్మల తర్వాత ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ కూడా జయప్రదనే. అలా కృష్ణతో వరుస సినిమాలు నటిస్తున్న సమయంలోనే జయప్రద ఎక్కడో పెద్దాయనను ఏదో అన్నదని టాక్ వినిపించింది. అది నిజమో కాదు తెలియకుండా, కొందరు దాన్ని పెద్దది చేస్తూ ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. ఇక దాంతో ఎన్టీఆర్ సైతం ఆమెను దూరం పెడుతూ వచ్చారు.
ఆ తరువాత యన్టీఆర్-శ్రీదేవి జోడీ జనాన్ని ఆకట్టుకోవడంతో అసలు యన్టీఆర్ సరసన జయప్రద ఊసు ఎవరూ ఎత్తలేదు. తరువాత విషయం తెలుసుకొనే లోపు, ఆయన రాజకీయ ప్రవేశం చేయడం, జయప్రద సైతం హిందీ చిత్రాలలో బిజీ కావడం జరిగాయి. ఏది ఏమైనా యన్టీఆర్ ను ‘పెద్దాయన’ అంటూ ఆమె ఎప్పుడూ గౌరవించేవారు.
జయప్రద సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. దానికి కూడా ఎన్టీఆర్ కారణమని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 1994లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో జయప్రద చేరారు ఆ తర్వాత ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆపై ఉత్తరాదిన సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. అలా ఎన్టీఆర్ కారణంగానే జయప్రద ఇటు సినిమాలను అటు రాజకీయాలలోనూ రాణించారన్నది వాస్తవం.