ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆయన..ఏపీలో కూడా పార్టీని మొదలుపెట్టారు. బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఏపీలో బిఆర్ఎస్ పెద్ద కార్యక్రమాలు చేయలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో రాజకీయం తాజాగా మొదలుపెట్టింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.
అయితే దీనిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాడుతున్నారు..అటు రాష్ట్రంలోని పార్టీలు సైతం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నారు గాని..బిజేపిపై పోరాటం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. దీంతో ఆ అంశాన్ని కేసిఆర్ భుజాన వేసుకున్నారు. ఎలాగో కేంద్రంలో బిజేపికి చెక్ పెట్టాలని చెప్పి రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్, బిజేపిల మధ్య వార్ నడుస్తోంది.
ఇక బిజేపిని ఎక్కడకక్కడ నిలువరించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కేసిఆర్ వాడుకుంటూ ముందుకెళుతున్నారు. ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడానికి స్టీల్ ప్లాంట్ అంశంపై పోరాటం మొదలుపెట్టారు. దీని ద్వారా విశాఖ రాజకీయాలని ప్రభావితం చేయాలనేది కేసిఆర్ కాన్సెప్ట్..దానికి తగ్గట్టుగా ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ చేత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్ధతు ప్రకటించారు. అలాగే బిడ్డింగ్ లో పాల్గొనాలని చూస్తున్నారు. సింగరేణి ద్వారా బిడ్డింగ్ లో పాల్గొనాలని కేసిఆర్ డిసైడ్ అయ్యారు.
తాజాగా తోట చంద్రశేఖర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారో వారికి వివరించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసి సమరశంఖారావం పూరిస్తారన్నారు. బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తెలంగాణా ప్రభుత్వం తరపున బిడ్ వేసేందుకు సిద్దమయ్యారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు బిఆర్ఎస్ కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు వెనుకాడబోదని హెచ్చరించారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ తో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కేసిఆర్ రెడీ అయ్యారు.