మోహన్‌బాబు నో చెప్పుంటే సౌందర్య మ‌ర‌ణించేది కాదు:ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి సౌందర్యను ఎన్ని త‌రాలు గ‌డిచినా మ‌ర‌చిపోవ‌డం చాలా క‌ష్టం. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్ష‌కుల‌కు మంత్ర ముగ్దులను చేసిన సౌంద‌ర్య‌.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి, సినీ ప్రియుల‌కు పెద్ద శాపం మ‌రియు చేదు జ్ఞాప‌కం.

అయితే తాజాగా సౌంద‌ర్య మ‌ర‌ణంపై బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ కార్తీక దీపం డైరెక్ట‌ర్ కాపుగంటి రాజేంద్ర ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్‌గా ప‌ని చేసిన రాజేంద్ర‌.. మోహన్ బాబు – సౌందర్య కలయికలో వచ్చిన శివ శంకర్, అల్లరి నరేష్‌తో రాంబాబు గాడి పెళ్లాం అనే సినిమాలను డైరెక్ట్ చేశారు. అయితే ఆనాటి జ్ఞాప‌కాల‌ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

ఆయ‌న మాట్లాడుతూ..శివశంకర్ సినిమా షూటింగ్ టైమ్‌లో సౌందర్య బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వెళ్ళడానికి మోహన్ బాబుని పర్మిషన్ అడిగింది. నిజానికి మోహన్ బాబు ఎవరైనా సినిమా మధ్యలో వెళ్తాను అంటే.. ఒప్పుకోరు. కానీ సౌందర్య బతిమాలడంతో ఒకే అన్నారు. అయితే ఆరోజు మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పుంటే.. ఆమె మ‌ర‌ణించేది కాదు. ఆమె మృతితో శివ శంకర్ సినిమా స్టోరీ మార్చాల్సి వచ్చింది. ఫ‌లితంగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది అని చెప్పుకొచ్చారు.