ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే జగన్ మాత్రం జనసేన కంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తనకు ఎక్కువ ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా తనపై ఉన్న కేసులు జగన్కు రాజకీయంగా మైనస్గా మారాయి. ఇక మరోసారి బీజేపీ+టీడీపీ జోడీ కడితే వైసీపీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఈ క్రమంలో బీజేపీతో జట్టుకడితే ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు అటు కేంద్రంలోను కీలకపాత్ర పోషించాలన్నదే జగన్ ప్లాన్గా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడకుండా అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు బీజేపీకి కీలకం కానున్నాయి. జగన్ ఇటీవల నరేంద్రమోడీని కలిసినప్పుడు ఆ పార్టీతో పొత్తుకు సీట్ల పరంగా బీజేజీకి బంపర్ ఆఫర్ ఇచ్చారన్న టాక్ కూడా బయటకు వచ్చింది. ఏపీలో బీజేపీకి ఏకంగా 15 ఎంపీ, 50 ఎమ్మెల్యే సీట్లు జగన్ ఆఫర్ చేసినట్టు వార్తలు హల్చల్ చేశాయి.
వాస్తవానికి జగన్కు 2014 ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ వచ్చింది. అప్పుడు బీజేపీ సైతం జగన్కు ఉన్న వేవ్ చూసి ఇంట్రస్ట్గానే ఉంది. అయితే అప్పుడు జగన్ తనకు పొత్తులు అక్కర్లేదన్న అతివిశ్వాసంతో ఉన్నాడు. గతంలో మోడీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ఉండడంతో మోడీతో పాటు అమిత్ టీడీపీతో పొత్తుకు పెద్ద ఇంట్రస్ట్గా లేరు. పైగా బాబు ఏపీకే పరిమితమైపోయారు. గుజరాత్ అల్లర్ల టైంలో చంద్రబాబు మోడీపై తీవ్రపదజాలంతో అప్పటి ప్రధాని వాజ్పేయ్కు కంప్లైంట్ చేశారు. బీజేపీతో పొత్తు వల్లే తమ పార్టీ ఓడిపోయిందని ఆయన 2009లో బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇవన్నీ మోడీ మర్చిపోయినట్టు లేరు.
అదే టైంలో చంద్రబాబు తన చాణక్యం ప్రదర్శించారు. వెంకయ్య ద్వారా బీజేపీతో పొత్తుకు పావులు కదపడంతో చివరకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య కలహాల కాపురం కంటిన్యూ అవుతోన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఆనాడే జగన్ బీజేపీతో పొత్తుకు ఓకే చెప్పి ఉంటే ఈనాడు జగన్ పరిస్థితి మరోలా ఉండేదనడం డౌటే లేదు.