దాదాపు పదేళ్ల తర్వాత తెరపై కనిపించినా తనలో స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి! తన 150వ సినిమా ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఇదే ఊపులో 151వ సినిమాగా డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు సైన్ చేసేశాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కనుక.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా త్వరగా ప్రారంభించాలని ప్రయత్నించినా.. బాహబలి-2 ఎఫెక్ట్ తో వెనక్కి వెళ్లిందట. అంతేగాక ఈ సినిమా విషయంలో నిర్మాత చరణ్కు చిరు.. కొత్త కండీషన్స్ పెడుతున్నాడట చిరు.
రేసుగుర్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు డ్రీమ్ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే! ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇప్పుడీ మూవీపై బాహుబలి2 ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. బాహుబలి-2 సినిమాను చూసిన చిరు.. ప్రొడక్షన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారట. అదే విషయాన్ని నిర్మాత కం తన కుమారుడు రామ్ చరణ్ కు చెప్పారట. బడ్జెట్ విషయంలో హద్దులు సవరించుకోమని సూచించారట. మొదట 100కోట్ల బడ్జెట్ తో తీయాలని అనుకుంటే.. ఇప్పుడు లెక్క చాలానే తేలుతోందని తెలుస్తోంది.
ఇదంతా సినిమా గ్రాండ్ నెస్ ను పెంచడానికే ఉపయోగించాలన్నది చిరు పెట్టిన ప్రధాన షరతు కావడం విశేషం. చరిత్ర ఆధారంగా తీసే సినిమా కావడంతో.. సెట్స్ వేయాల్సి ఉంటుంది. వీటినే మరింత భారీగా చేయనున్నారట. ఈ ప్రభావంతో షూటింగ్ ప్రారంభం కూడా ఆలస్యం కానుందని తెలుస్తోంది. మొదటగా ఆగస్ట్ లో చిరు151 షూటింగ్ మొదలవుతుందని అనుకున్నా.. ఇప్పుడు దాదాపుగా సెప్టెంబర్ చివరి వరకూ పోస్ట్ పోన్ అయినట్లు టాక్. మార్కెటింగ్ సూత్రాల విషయంలో బాహుబలిని చిరు టీమ్ ఆదర్శంగా తీసుకోబోతోందట.