విపక్షం వైసీపీ నేత జగన్ 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో దూసుకుపోతున్నారా? ఎట్టి పరిస్థితిలోనూ 2019లో అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న యువనేత ఆ దిశగా తన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారా? ఈ క్రమంలో దశాబ్దాల కిందట టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నాడా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
ఏపీలో అధికారం చేపట్టాలనేది జగన్ కి అత్యవసరమైన విషయం. 2014లో చేతిదాకా అందిన సీఎం పీఠం.. కొద్ది తేడాతో తప్పిపోయింది. అయితే, 2019లో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి అధినేతది. అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా, మరోవైపు కేసుల పరంగానూ జగన్కి అధికారం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే ఆయన రెండే ళ్ల ముందు నుంచే 2019 ఎన్నికలపై దృష్టి పెట్టారు. దీనికిగాను ఇప్పటికే బిహార్కు చెందిన ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు.
ఇక, ఈ క్రమంలో 1994లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆరు నెలలు, లేదా ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా ప్రజల్లో మరింత ప్రచారం పొందడంతోపాటు.. గెలుపు గుర్రం తథ్యమని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పాలిటిక్స్ అన్నాక.. వ్యక్తుల మధ్య విభేదాలే తప్ప ఆలోచనల మధ్య కావు. కాబట్టి ఎన్టీఆర్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఈ ప్లాన్ బాగున్నప్పటికీ.. జగన్కి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్న. నిజానికి ప్రస్తుతం ఉన్న సిట్టింగులనే జగన్ ఆయా స్థానాల్లో నిలబెడతాడు. ఇక, జంపింగ్ జిలానీలు ఉన్న స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలనేది ప్రశ్న. అదేసమయంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అభ్యర్థులు కూడా ముందుకు వచ్చేఅవకాశం తక్కువ. మరి ఈ పరిస్థితిలో జగన్ వ్యూహం సక్సెస్ కావడం కొంత కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కాగా, త్వరలోనే విజయవాడలో వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని జగన్ భావిస్తున్నాడు. కాబట్టి దానిలో తన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.