ఏపీ కేబినెట్ ప్రక్షాళన అధికార టీడీపీలో సెగలు రేపుతోంది. మంత్రి పదవి రాదని డిసైడ్ అయిన చాలా మంది సీనియర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొందరైతే తమకు మంత్రి పదవి రాకపోయినా ఓకే గాని..తమ శత్రువులకు మంత్రి పదవి వస్తే పార్టీ వీడేందుకు కూడా సిద్ధమే అని బాబుకు హెచ్చిరికలు పంపుతున్నారట. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండనని రామసుబ్బారెడ్డి ఇప్పటికే బాబును కలిసి చెప్పేశారట.
ఈ క్రమంలోనే మంత్రి పదవి రాదని తెలిసి తీవ్ర అసంతృప్తితో రగులుతోన్న కొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఏపీ రాజకీయవర్గాల్లో ఈ రోజంతా ట్రెండ్ అయ్యాయి. ఎవరిని చూసినా మంత్రి వర్గం గురించే చర్చ జరుగుతోంది. ఓవరాల్గా వైసీపీ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు వస్తాయన్న వార్తలు టీడీపీలో సీనియర్లు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దశాబ్దాలుగా పార్టీలో ఉన్న తమను పక్కన పెట్టి నిన్నలా మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని ? వారు ఫైర్ అవుతున్నారు. తమకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ ఒకటైతే…నిన్నకాక మొన్న వచ్చిన వారికి పదవులు ఏంటని వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ రోజు అమరావతి టాక్ ప్రకారం 14 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి షాక్ ఇచ్చి కాస్త అటూ ఇటూగా వైసీపీలోకి జంప్ చేసే అంశంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఏదేమైనా మంత్రివర్గ ప్రక్షాళన పూర్తయిన వెంటనే ఏపీ టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న లావా ఒక్కసారిగా బద్దలవ్వనుందని తెలుస్తోంది. వీరంతా ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో ఆరేడు నెలల్లోగా విడతల వారీగాను, సింగిల్ సింగిల్గాను జగన్ గూటికి చేరతారని సమాచారం. ఏదేమైనా ఏపీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద కాకే రేపుతోంది.