జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఖాయమై పోయిన నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాలకు కొదవలేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవి సైతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్పై అందరి దృష్టీ పడింది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. ఎంత మెజారిటీ వస్తుంది? అనేది పెద్ద చర్చకు తెరదీసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ తన సొంత జిల్లా పశ్చిమగోదావరి కేంద్రమైన ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటానని చెప్పడంతో పవన్ ఈ జిల్లా నుంచే పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే పవన్ ఇదే జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, మంత్రి మాణిక్యాల రావు 2014లో గెలుపొందారు. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాణిక్యాల రావుకి బీజేపీ, టీడీపీలు పొత్తులో భాగంగా సీటు కేటాయించారు. దీనికి తోడు పవన్ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో ఆయన గెలుపొందారు.
ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి పవన్ పోటీ చేస్తే.. మిగిలిన ఎవరు బరిలో నిలిచినా పవన్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘కాపు’ సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారు గెలుపొందుతూ వస్తున్నారు. షాక్ ఏంటంటే 2009లో ఇక్కడ పీఆర్పీ అభ్యర్థి ఈలి నాని విజయం సాధించారు.
ఇక, 2019 ఎన్నికల్లో స్వయంగా ‘పవన్’ రంగంలోకి దిగుతుండడంతో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడతాయి. దీంతో ఆయన సులువుగా గెలుస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తంమీద ‘పవన్’ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే మంత్రి మాణిక్యాలరావు మాజీ కావడం ఖాయమే ననే కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో?!