`ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్` అన్నట్లు ఉంది ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి! గతంలో కంటే ప్రతిపక్ష నేత జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు! హోదా విషయంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపి.. ప్రజల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్రజల్లోకి చేరలేదు. కానీ సరైన సమయంలో జగన్ స్పందించినా.. విశాఖ ఎయిర్పోర్టులో దూకుడుగా వ్యవహరించన తీరు ఆయనకు మైనస్గా మారుతోందని, ఇది పార్టీకి లాభించక పోగా మరింత నష్టపరుస్తోందని పార్టీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నారట,
హోదా కావాలని కోరుతూ విశాఖ ఆర్కే బీచ్లో యువత శాంతియుత నిరసన తెలపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే! దీనికి మద్దతుగా వైసీపీ అధినేత జగన్,, కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇందులో స్వయంగా పాల్గొనేందుకు వెళుతున్న ఆయన్ను ఎయిర్ పోర్టు అధికారులు అడ్డగించారు. ఆ సమయంలో ఆయనపై ప్రజల్లో కొంత సానుభూతి వ్యక్తమైంది, కానీ ఎయిర్ పోర్టు అధికారులతో `ముఖ్యమంత్రినే అడ్డుకుంటున్నారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా అంటూ` వ్యవహరించిన తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని సీనియర్లు భావిస్తున్నారు.
మైలేజీ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆయనకే రివర్స్ అవుతున్నయి, విశాఖ ఎయిర్ పోర్ట్ లో వ్యవహరించిన తీరు కారణంగా సానుభూతి అంతా ఆవిరైపోయిందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో జగన్ కు ఎన్నిసార్లు తాము విజ్ఞప్తి చేసినా.. తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మాత్రం మారడం లేదని వారు చెబుతున్నారు.
జగన్ చర్యల కారణంగా ఆయనను నమ్ముకున్న నాయకులంతా నట్టేట మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. జగన్ కు ప్రత్యామ్నాయంగా పవన్ ఎదుగుతున్న క్రమంలో… ఇలాంటి తీరు వైసీపీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాలను సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ ఇప్పటకి అయినా దూకుడు తగ్గిస్తాడేమో చూడాలి.