కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో తనకు పక్కలో బల్లెంలో మారిన వైఎస్ జగన్ను నిలువరించాలంటే ముందు వైసీపీకి ఆయువుపట్టైన కడప జిల్లాలోనే ఆ పార్టీని దెబ్బ తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగానే నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే గత కొన్నాళ్లుగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. కడప జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తే టీడీపీ అధినేత ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. . ఇప్పుడు బాబు వ్యూహం ప్రకారమే జగన్ కంచుకోటలో టీడీపీ తన జండా ఎగురవేసింది. జిల్లాలో తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికలలో టీడీపీ విజయ దుందుభి మోగించి, రెండు ఎంపీపీలను తన ఖాతాలో వేసేసుకుంది. కాగా.. విపక్ష వైపీసీ మాత్రం … కేవలం ఒక ఉప ఎంపీపీ స్థానాన్ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది. ఇదే సమయంలో,.. కోరం లేని కారణంగా వేముల మండలంలో ఉప ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
కడప జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న.. పుల్లంపేట, వీరపునాయునిపల్లె మండలాల్లో ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఎంపీపీ పదవులకు అంత ప్రాధాన్యం లేకపోయినా… జిల్లాలో అధికార పార్టీ చేపట్టిన ఆకర్ష్ నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. పుల్లంపేట మండలంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఎ.రజనీ , వైసీపీ ఎంపీపీ అభ్యర్ధిగా పాగాల వెంకటమ్మ పోటీపడ్డారు. ఈ మండలంలో 11 మంది ఎంపీటీసీలు ఉండగా, 9 మంది ఎన్నికకు హాజరయ్యారు.
వీరిలో ఐదుగురు రజనీకి మద్దతు పలకడంతో ఒ క్క ఓటు మెజారిటీతో టీడీపీ తరపున ఆమె ఎంపీపీ అయ్యారు. కాగా, వీరపునాయునిపల్లె మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా నర్రెడ్డి ప్రసాద్రెడ్డి , వైసీపీ నుంచి సరోజనీదేవి పోటీపడగా మొత్తం 9 మంది ఎంపీటీసీలకుగాను ఏడుగురు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. వీరిలో నలుగురు నర్రెడ్డికి మద్దతివ్వడంతో ఆ స్థానం కూడా టీడీపీ ఖాతాలో చేరింది.. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కదం తొక్కింది. మొత్తంమీద కడపలో టీడీపీ చాపకింద నీరులా బలం పెంచుకుంటోందని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.