జనసేనకు వైసీపీ సీట్లు ఫిక్స్ చేస్తుంది..అదేంటి వైసీపీ సీట్లు ఫిక్స్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. నిజమే టిడిపి-జనసేన పొత్తు ఉంటే..జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే టిడిపి పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు దక్కవనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మొదట నుంచి రెండు పార్టీల పొత్తు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పవన్కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎలా పోటీ చేయాలో, చేయకూడదో తమ ఇష్టమని చెప్పడానికి వైసీపీ నేతలు ఎవరు అని పవన్ ఫైర్ అవుతూనే ఉన్నారు. అయినా సరే వైసీపీ నేతలు పొత్తు పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పేర్ని నాని..జనసేనకు 25 సీట్లు మాత్రమే దక్కుతాయని అంటున్నారు.
ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక అసెంబ్లీ స్థానంలో మాత్రమే తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పవన్కల్యాణ్ సీఎం ఎలా అవుతారని పేర్ని ప్రశ్నించారు. ఈ లెక్కన జనసేనకు 25 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు. సినీ గ్లామర్ను అడ్డుపెట్టుకుని పవన్కల్యాణ్ ఎవరికోసం పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసని, కిరాయికి ఒప్పుకున్నాం కదా, కూలి కోసం ఏదో ఒకటి మాట్లాడాలనే ధోరణిని పవన్ కల్యాణ్ ప్రదర్శిస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా జనసేన పోటీ చేసే సీట్లు ఇవే అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే పవన్కు సిఎం పదవి కూడా రాదని అంటున్నారు. అయితే టిడిపి-జనసేన పొత్తుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పొత్తు దాదాపు ఫిక్స్ గాని, ఇంకా సీట్ల విషయం తేలలేదు.