ఏపీలో సాధారణ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గంలో అధికార వైసీపీలో రాజకీయం ఇప్పటికే రచ్చకెక్కింది. గత మూడేళ్ల నుంచి స్థానిక నేత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇద్దరు యెడమొకం పెడముఖంగానే ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా చీలిపోయింది.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా రెండు వర్గాలుగానే ఉన్నారు. అయితే చింతలపూడి ఎంపీకి సొంత నియోజకవర్గ కావడంతో ఇక్కడ ఆయన వర్గం నేతలు.. ఆయన వర్గం ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి ఎలీజా మరోసారి పోటీ చేస్తారా ? అంటే ఎంపీ వర్గం నేతలు.. కార్యకర్తలు అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలీకి ఈసారు సీటు ఇవ్వరని.. ఒకవేళ సీటు ఇస్తే చింతలపూడిని బంగారు పళ్లెంలో పెట్టి టిడిపికి అప్పగించేయడమే అని చెబుతున్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు అటు పార్టీ, ఐప్యాక్ చేయించుకున్న అంతర్గత సర్వేలలోనూ ఎలీజాకు అనుకూలంగా రిపోర్టులు రాలేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న కుమ్ములాటలు నేపథ్యంలో పార్టీ గ్రాఫ్ రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. దీనికి తోడు ఎలిజా కూడా తనకు అనుకూలంగా కొంతమందితో గ్రూప్ తయారు చేసుకుని ఏకపక్షంగా రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణ కూడా ఎంపీ వర్గం నుంచి వ్యక్తం అవుతుంది.
ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికలలో ఎలీజాకు సీటు రాదని.. సీటు ఇవ్వకూడదని జగన్ కూడా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎంపీ శ్రీధర్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు తనకు వచ్చే ఎన్నికలలో ఏలూరు ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు.. చింతలపూడి అసెంబ్లీ టికెట్ మాత్రం తాను చెప్పిన వారికే ఇవ్వాలని కరాకండిగా తేల్చి చెప్పగా జగన్ శ్రీధర్ అక్కడ ఏం ? జరుగుతుందో అంతా తెలుసు.. మళ్లీ ఎంపీగా నువ్వే పోటీ చేస్తున్నావు.. నీ ఇష్టం మేరకే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి నిర్ణయం ఉంటుందని చెప్పారట.
ఇక గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఎంపీ శ్రీధర్ పట్ల ఉన్న అపారమైన నమ్మకం.. గౌరవం నేపథ్యంలో ఈసారి చింతలపూడి వైసిపి ఎమ్మెల్యే క్యాండిడేట్ విషయంలో శ్రీధర్ ఏం నిర్ణయం ? తీసుకున్నా దానికి అధిష్టానం కట్టుబడి ఉండేలా ఉంది. మిథున్రెడ్డి సైతం శ్రీథర్తో సై అంటూ వెళ్లొద్దు.. సమన్వయంతో పని చేయమని ఎలీజాకు కొద్ది రోజుల క్రిందట చెప్పినా ఆయన పట్టించుకున్నట్టు లేదు.
అటు నియోజకవర్గంలో పర్యటిస్తోన్న ఎలీజాకు ప్రశ్నల అనేకానేక ప్రశ్నలు ఎదురవుతున్నా సమాధానాలు లేవు. అసలు అభివృద్ధి గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానం. ఇక రాజకీయంగా చూస్తే పైన జగన్ చెప్పిన మాటతో పాటు ఇటు మిథున్రెడ్డి శ్రీథర్కు ఇచ్చే ప్రయార్టీ, శ్రీథర్ క్లీన్ ఇమేజ్ నేపథ్యంలో ఈ సారి చింతలపూడిలో ఎలీజా సీటు చిరిగిపోయేలానే ఉంది. 2024 ఎన్నికల్లో చింతలపూడి వైసీపీ నుంచి కొత్త క్యాండెట్ అసెంబ్లీ బరిలోకి దిగడం పక్కాయే..!