అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తిరువూరులో టిడిపి పరిస్తితి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు..కేడర్ ఉంది..అయినా సరే టిడిపి గెలిచి 20 ఏళ్ళు అయిపోయింది. అంటే నాయకులు ఉన్నా సరే వారి మధ్య సమన్వయం లేదు. ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు ఉంటుంది..అందుకే ఇక్కడ టిడిపి గెలవడం కష్టమవుతుంది. 1999 వరకు ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది.
ఆ తర్వాత నుంచి టిడిపికి ఏది కలిసిరావడం లేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. అయితే మూడుసార్లు నల్లగట్ల స్వామీదాస్ ఓటమి పాలయ్యారు. దీంతో గత ఎన్నికల్లో టిడిపి నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ని బరిలో దింపారు. అయినా సరే టిడిపికి గెలుపు దక్కలేదు. ఇక ఓడిపోయాక జవహర్ తన సొంత స్థానం కొవ్వూరు వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ నాయకుడు లేకుండా పోయాడు.
ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ దేవదత్ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన సైతం తిరువూరులో అనుకున్న మేర టిడిపిని బలోపేతం చేయలేదు. పైగా కొందరు నాయకులు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే స్వామీదాస్ ఓ వైపు ఉంటే..వాసం మునియ్య ఓ వైపు ఉన్నారు. ఇలా ఎవరికి వారు రాజకీయం చేస్తున్నారు. దీంతో టిడిపికి నష్టం జౌర్గుతుంది. ఈ క్రమంలో తిరువూరు టిడిపి నేతలని బాబు పిలిపించి క్లాస్ ఇచ్చారు.
పార్టీలోని నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి దేవదత్తుతో కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. తిరువూరులో ఇన్చార్జి పార్టీ కార్యాలయం తప్ప పార్టీ తరఫున మరో కార్యాలయం ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే కొంత మందిని వదులుకోవడానికి కూడా తాను సిద్ధమేనని హెచ్చరించారు. దీంతో నేతలు ఇప్పటికైనా సర్దుకుని కలిసి పనిచేసి తిరువూరులో టిడిపిని గెలిపిస్తారేమో చూడాలి.