తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కేసిఆర్ సైతం బిజేపినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బిజేపి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది.
కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బిజేపి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం గా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే పార్టీలో అంతర్గత పోరుతో ఇబ్బందులు వచ్చాయి. కానీ నిదానంగా అవి తగ్గాయి. పైగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. దీంతో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఇదే సమయంలో బిజేపిలోకి వలసలు ఆగిపోగా, కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో బలమైన నేతలుగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సైతం కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది.
వీరిని బిజేపిలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ గట్టిగానే ప్రయత్నించారు. కానీ వారు ఏ మాత్రం బిజేపి వైపు రావడానికి మొగ్గు చూపలేదు. ఆ విషయం స్వయంగా ఈటల రాజేందర్ చెప్పే పరిస్తితి. ఈ క్రమంలోనే వారు కాంగ్రెస్ లోకి వెళుతున్నారని తేలిపోయింది. జూన్ 8వ తేదీన వారిద్దరూ హస్తం గూటికి వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చర్చోపచర్చల అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ లోనే చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అయితే మొదట జూపల్లి చేరతారని..తర్వాత జూన్ 20న భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ ఉంది..అప్పుడు ఖమ్మంలో భారీ సభ పెట్టి పొంగులేటి చేరతారని ప్రచారం వస్తుంది. చూడాలి మరి ఇద్దరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తారో లేదో.