ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల్లో సీటు విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది..అటు వైసీపీలో, ఇటు టిడిపిలో అదే పరిస్తితి..ఈ క్రమంలోనే నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కూడా దారి తీస్తుంది. ఇక టిడిపిలో విజయవాడ సీటు విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక్కడ సొంత అన్నదమ్ముల మధ్య ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ కొంతకాలం టిడిపి అధిష్టానానికి దూరమయ్యారు.
అదే సమయంలో విజయవాడలో కేశినేని నాని, ఇతర టిడిపి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వస్తుంది. ఈ కోల్డ్ వార్ లోకి కేశినేని సోదరుడు కేశినేని చిన్ని కూడా వచ్చారు. ఆయన విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు..అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక కేశినేని నానికి యాంటీగా ఉన్న టిడిపి నేతలు..చిన్నికి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్ని సైతం విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తున్నారు. దీంతో సీటు విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది.
తాజాగా కూడా కేశినేని చిన్ని..టిడిపి అధిష్టానం ఆదేశిస్తే..విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో తన సోదరుడు నానికి ఇచ్చిన, ఆయన గెలుపు కోసం కష్టపడతానని చెప్పుకొచ్చారు. ఇక కొంతకాలం టిడిపికి దూరంగా ఉన్న నాని ఈ మధ్య మరింత యాక్టివ్ అయ్యారు. తాజాగా చంద్రబాబు గుడివాడ పర్యటనలో నాని ప్రత్యక్షమయ్యారు.
దీంతో నాని కూడా మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో బెజవాడ ఎంపీ సీటు ఎవరికి ఇస్తారనే కన్ఫ్యూజన్ ఉంది. నానికి అసెంబ్లీ సీటు ఇచ్చి, చిన్నికి ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం ఉంది. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.