తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజేపి..కేసిఆర్ సర్కారుపై తమదైన శైలిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసిఆర్ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బిజేపి ఉపయోగించుకుని ముందుకెళుతుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు సైతం..తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు.
ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడే గెలుపే లక్ష్యంగా బిజేపి పనిచేస్తుంది..ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పనిలో పనిగా బిజేపి పెద్దలు..తెలంగాణపై కూడా ఫుల్ గా ఫోకస్ పెట్టారు. అడపాదడపా తెలంగాణకు వస్తున్నారు. తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..చేవెళ్ళ సభలో పాల్గొన్నారు. భారీ ఎత్తున సభ జరిగింది. ఇక కేసిఆర్ లక్ష్యంగా షా విమర్శలు చేశారు. ఇదే సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిజేపి అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లని రద్దు చేసి..వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కేలా చూస్తామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ కారు స్టీరింగ్.. మజ్లిస్ పార్టీ చేతిలో ఉందని, రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు లోపభూయిష్టంగా చేపట్టారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ను రద్దుచేస్తామని, ఆ ఫలాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దక్కేలా చూస్తామని అన్నారు. ఇక నెక్స్ట్ కేసిఆర్కు సిఎం పదవే దక్కే ఛాన్స్ లేదని, ఇక పిఎం పదవి మోదీకే రిజర్వ్ చేసి ఉందని అన్నారు.
అయితే ముస్లిం ఓట్లు ఎలాగో బిజేపికి పడవని ఉద్దేశంతో షా..రిజర్వేషన్లు రద్దు చేస్తామని చేస్తామని చెప్పినట్లు కనిపిస్తుంది. అలాగే ఎస్సీ, బీసీల్లో లబ్ది పొందేందుకు వారికి దక్కేలా చేస్తామని అంటున్నారు. మరి షా రిజర్వేషన్ వ్యూహం ఏ మేర ఫలిస్తుందో చూడాలి.