క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం తర్వాత కోలీవుడ్ లో ప్రధాన పాత్రలో `కొండ్రల్ పావమ్` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సొంత గడ్డ అయిన తమిళ ఇండస్ట్రీపై చిరు అసహనం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ రిపోర్టర్ `ఈ మధ్య తెలుగులోనే ఎక్కువ సినిమాలు.. తమిళంలో ఎందుకు చేయడం లేదు..?` అని ప్రశ్నించాడు. అందుకు వరలక్ష్మీ.. తమిళంలో అవకాశాలు రావడంలేదని, అందుకే నటించట్లేదని పేర్కొంది. అక్కడితో ఆగలేదు.. 2011లో `పోడా పోడి` చిత్రం ద్వారా తమిళంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని.. అప్పటినుంచి 9 ఏళ్ల పాటు ఇక్కడ సినిమాలు చేశాను.
ప్రతినాయకిగా రకరకాల పాత్రలో వైభవధ్యాన్ని చూపిస్తూ నటించాను. అయినా రాని గుర్తింపు తెలుగులో `క్రాక్` సినిమాతో వచ్చిందని వరలక్ష్మి పేర్కొంది. ఇక్కడ తనకు సరైన స్థానాన్ని కల్పించలేదని.. కారణం తనను చూసి భయపడతారో లేక ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అవుతారో తెలియదని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. కానీ తెలుగులో మంచి పాత్రలతో పాటు గౌరవం, అడిగినంత పారితోషికం దక్కుతోందని ఓపెన్ గానే వరలక్ష్మి చెప్పేసింది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.