జబర్దస్త్ రైటర్ తో నాగార్జున సినిమా ప్లాన్… ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యేనా?

జబర్దస్త్ షో గురించి తెలుగునాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తికాదేమో. అంతలా ఆ షో తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. ఈ షో ద్వారా ఎంతోమంది యాక్టర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈ షోలో రైటర్స్ గా పనిచేసే వారికి కూడా మంచి గుర్తింపు వుంది. అయితే ఇపుడు అలాంటివారిని వెతికి పట్టుకొనే పనిలో వున్నాడు కింగ్ నాగార్జున. అవును, నాగార్జున ఎప్పుడూ కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలను తెరపైకి తీసుకువచ్చి మంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నారు.

అందులో ముందుగా రామ్ గోపాల్ వర్మ ఒకరని చెప్పుకోవచ్చు. అయితే నాగార్జున ఈ మధ్యకాలంలో మాత్రం కొత్త దర్శకులతో సినిమాలు పెద్దగా చేసిన దాఖలాలు లేదు. ఇక ఇప్పుడు మాత్రం ఓ యువర్ రైటర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. అతను ఇంతకుముందు జబర్దస్త్ షోలో మంచి రైటర్ గా గుర్తింపు అందుకున్న రచయిత అని సమాచారం. జబర్దస్త్ ద్వారా కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా కొంతమంది రైటర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అలాంటి వారిలో ముఖ్యంగా ప్రసన్న కుమార్ గురించి చెప్పుకోవచ్చు. ప్రసన్నకుమార్ మొదట త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో చేసిన సినిమాలకు రైటర్ గా వర్క్ చేస్తూ ఉండేవాడు. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా “సినిమా చూపిస్త మామ” మంచి సక్సెస్ అందుకున్న సంగతి విదితమే. ఆ తరువాత “నేను లోకల్” కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసినదే. కాగా వీరు ఇప్పుడు రవితేజతో “ధమాకా” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఎప్పటినుంచో ఈ రచయిత దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నాగార్జున ప్రసన్న కుమార్ కు ఆఫర్ ఇవ్వబోతున్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది.