తాజాగా జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు సీటు గ్యారెంటీగా ఉంటుందని ఆశించిన ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బెర్త్ దక్కలేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అలిగారు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎక్కడా ఫలితం లభించలేదు. దీనికి కారణం ఏంటి ? అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొందరు అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తేనన్న ప్రచారం ఒంగోలులో వినిపిస్తోంది. కరణం కారణంగానే.. బాలినేనికి.. పదవి దక్కలేదని చెబుతున్నారు. వాస్తవానికి అత్యంత కీలకమైన ప్రకాశం జిల్లాలో జగన్ బంధువుగా బాలినేని హవా నడిచింది.
అదే సమయంలో అసలు కరణంను గత ఎన్నికల తర్వాత.. టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకువచ్చింది కూడా బాలినేనేనని అంటారు. ఎందుకంటే.. కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువ చేసేందుకు బాలినేని వేసిన వ్యూహంలో భాగమే కరణం రాకని చెబుతారు. వారిద్దరు పాతమిత్రులు కూడా. కరణం 1999లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచారు. అదే టైంలో బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అప్పటి నుంచే పార్టీలు వేరు అయినా వీరి మధ్య స్నేహబంధం చెక్కు చెదర్లేదు.
కరణం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పడతారని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అన్న ప్రచారమూ ఉంది. ఇలాంటి కరణం కారణంగానే ఇప్పుడు బాలినేనికి పదవి దక్కలేదనే టాక్ వస్తుండడం గమనార్హం. కరణం.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత.. బాలినేనికి సంబంధించిన కారులో రూ.10 కోట్లు చెన్నై పోలీసులుపట్టుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడింది. దీనికి తోడు.. కరణం క్లోజ్ ఫ్రెండ్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉదంతం కూడా అప్పట్లోనే తెరమీదికి వచ్చింది.
కరణం రాకతోనే.. వైసీపీకి గడ్డు కాలం కూడా మొదలైందనే విమర్శలు వున్నాయి. ఆయన పార్టీ మారిన ఏడాదే.. కరోనా విజృంభించడం.. లోకల్ ఎన్నికలు వాయిదా పడడం.. ఎన్నికల కమిషనర్తో ప్రభుత్వా నికి వివాదాలు తలెత్తడం.. వంటివి తెరమీదకి వచ్చాయి. అదే సమయంలో కరణం బంధువు వడ్డే శోభనాద్రీశ్వరరావు.. కోర్టుల్లో కేసులు వేసి.. సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. ఇలా అనేక కేసులు హైకోర్టు లో విచారణకు వచ్చాయి. మరోవైపు కరణం పార్టీలో చేరక ముందు వరకు బాలినేని హవా జోరుగా సాగింది. ఇక, ఆ తర్వాత.. బాలినేని హవా తగ్గుతూ వచ్చింది. పార్టీలోకి ఐరన్ చేరిన తర్వాతే.. ఇవన్నీ జరిగాయని.. బాలినేని వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా పరిణామం ఏంటంటే.. బాలినేనికి ఏకంగా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీనికి కరణం కారణమ ని అంటున్నారు. బాలినేనికి ఒక టీడీపీ పత్రికతో సంబంధం ఉందని.. ఆయన ప్రభుత్వానికి సంబంధిం చిన లీకులు ఇస్తున్నారనే చర్చలు కూడా స్థానికంగా నడుస్తున్నాయి. మరోవైపు.. జగన్ మాతృమూర్తితో బాలినేని ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేనికి సీటు దక్కలేదని టాక్ ? ఏదేమైనా కరణం ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి, కీలక నేతలకు మూడిపోతుందన్న నానుడి బాలినేని విషయంలో మరోసారి రుజువైందని జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న చర్చలు..!