తెలంగాణలో టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి.. గత కొన్నాళ్లుగా మరింత దూకుడుగా ఉన్నాడు. కేసీఆర్పై విమర్శలు, ఆరోపణలు వాడి వేడిని మరింత పెంచారు. ఇటీవల ముగిసిన మహానాడు తర్వాత ఈ వాడి మరింత పెరిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పడు ప్రధాన సమస్య.. టీడీపీకి మీడియా కవరేజ్ ఘోరంగా తగ్గిపోయిందట!
తమ పక్షానే ఉంటాయని భావించిన ఆ రెండు పత్రికలు కూడా చాలా వరకు ఏపీలో టీడీపీకి బాకా ఊదుతున్నా.. తెలంగాణలో మాత్రం అధికార కేసీఆర్ కనుసన్నల్లోనే వార్తల ఎడిటింగ్ చేస్తున్నాయట. దీంతో తెలంగాణలో అటు టీడీపీకి, ఇటు రేవంత్ రెడ్డి వంటి టీడీపీ ఫైర్ బ్రాండ్కి కూడా మీడియా ప్రాధాన్యం భారీగా తగ్గిపోయిందట. విలేకరులు భారీ ఎత్తున రేవంత్ ప్రెస్ మీటింగ్లకు వస్తున్నా.. తెల్లవారి ఆయన వార్తలను పత్రికల్లో వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతోందట!
ఎప్పుడైనా వచ్చినా ప్రభుత్వానికి మరీ వ్యతిరేకంగా ఉన్న అంశాలను తొలగించి…అలా లైట్ గా వదిలేస్తున్నారు. సహజంగా పత్రికలు అయినా.. చానళ్లు అయినా ప్రతిపక్షాల వాయిస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం చేసే మంచి పనులూ చెప్పాలి. దీనిలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ గా సాగుతోంది. ప్రభుత్వానికి బాకా ఊదుతూ ప్రతిపక్షాలు చెప్పే మాటలకు మీడియా కనీస ప్రాధాన్యత ఇవ్వటం లేదనే టీ టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి ఈ తతంగం వెనకాల అధికార టీఆర్ ఎస్ హస్తం ఉందని బాహాటంగానే వినిపిస్తోంది. మరి టీడీపీ పరిస్థితి ఏంటో ఆ నేతలకే తెలియాలి.