నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ఇప్పుడు పొలిటీషియన్ని మించిపోయారనే టాక్ వినబడుతోంది. ముఖ్యంగా ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఆయన పొలిటీషియన్లకు ఒక అడుగు ముందుకు వేసినట్టుగా మాట్లాడారు. హోదా ఇక ముగిసిన సమస్య అంటూ ఢిల్లీలో ఆయన కామెంట్లు కుమ్మరించారు. అంతేకాదు.. హోదాను మించిన ప్యాకేజీ ఏపీకి గుండుగుత్తుగా అప్పజెప్పామని, దీంతో ఏపీ వెలిగిపోవడం ఖాయమని అన్నారు.
ఈ కామెంట్లు వింటుంటే.. పనగడియా ఫక్తు పొలిటీషియన్ను మించిపోయాడని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ మాట గత కొన్నాళ్లుగా అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు ఏపీ ప్రజలకు వినిపిస్తూనే ఉన్నారు. హోదా ఇక ముగిసిన ఛాప్టర్ అని, దీనికన్నా ప్యాకేజీ బెటర్ అని చంద్రబాబు సహా మొన్నటికిమొన్న విజయవాడ వచ్చిన కమల దళాధిపతి షా కూడా వల్లెవేశాడు. తాజాగా దీనిపై తొలిసారి నొరు విప్పిన పనగడియా కూడా పొలిటీషియన్ల మాదిరిగానే హోదా ముగిసిందని, ప్యాకేజీ భేష్ అని కామెంట్లు కుమ్మరించాడు.
నిజానికి 2014 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీకావు. అయితే, ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని.. అధికారంలోకి వచ్చాక.. ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హోదాపై చేతులు ఎత్తేశారు. కాబట్టి.. ఇప్పుడు కారణాలేవైనా.. హోదా విషయం.. ముగిసిన అధ్యాయం అనుకోవాలా? మఉగించిన అధ్యాయం అనుకోవాలా? కాబట్టి.. పనగడియా చేసిన వ్యాఖ్యలు పొలిటీషియన్ లనే మించి పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.