2019లో ఎట్టి పరిస్తితిలోనూ ఏపీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని పంతం మీదున్న జగన్.. తన పట్టుదలను నెరవేర్చుకునేందుకు, తన కలల పీఠం ఎక్కేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు! తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. మొన్నామధ్య ప్రధానితో కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లడం.. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున రచ్చచేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వెనకాల జరిగిందేంటో బయటకు వస్తోంది.
గత వారంలో తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన కమల దళాధిపతి.. అమిత్ షా.. ఢిల్లీలో జగన్.. మోడీకి ఇచ్చిన బంపర్ ఆఫర్ ను బయటపట్టాడట. 2019 ఎన్నికల్లో ఏపీలో సీఎం సీటు తమకు చాలని .. త మ పార్టీకి అంతకు మించి ఏమీ అక్కరలేదని జగన్ కుండ బద్దలు కొట్టాడట. అదేసమయంలో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో దాదాపు 20 సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు కూడా జగన్ వెనుకాడలేదట. అంతేకాకుండా అవసరమైతే.. మొత్తం ఎంపీ సీట్లన్నీ బీజేపీకి కట్టబెట్టేందుకు సిద్దంగానే ఉన్నట్టు జగన్ చెప్పాడని షా.. తన పార్టీ నేతల దగ్గర వెల్లడించారట.
రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీతో పొత్తు వద్దంటూ.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి, కన్నా వంటి ప్రముఖులు ఢిల్లీలో పోరు పెడుతున్నారు. మొన్నామధ్య షా మీటింగ్లోనూ స్థానిక నేతలు ప్లకార్డులు పట్టుకుని బాబుతో కటీఫ్ చేసుకోవాలని కోరారు. దీనిపై నేరుగా స్పందించని షా.. అవసరమైన పక్షంలో 2019లో జగన్తో పొత్తుకు సిద్ధమేననే సంకేతాలు ఇచ్చారని సమాచారం.
అంటే.. బీజేపీ నేతలకి బాబు జమానాలో గుర్తింపు దక్కడం లేదనే వార్తలు ఢిల్లీకి వెళ్లాయి. ఇక, ఏపీ బీజేపీలో కామినేని, హరిబాబు వర్గాలు మాత్రం బాబు స్కూలే బాగుందని బజాయిస్తున్నారట! మొత్తానికి 2019 ఎన్నికల సమయానికి ఏపీలో బీజేపీ ఎటు జంప్ చేసి ఎవరి చేయిని అందుకుంటుందో చూడాలి. ఇదే విషయంపై బాబు కూడా నర్మగర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి మాట్లాడతామని అన్నారు. సో.. 2019 నాటికి జగన్ కల ఫలిస్తుందో.. బాబు చిరస్థాయి అధికారం కోరిక నెరవేరుతుందో చూడాలి.