ఏపీలో అధికార టీడీపీని ఢీకొట్టడంలో దారుణంగా ఫెయిల్ అవుతోన్న విపక్ష వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు ఏకంగా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వైసీపీ బలంగా ఉన్న మరో కీలక జిల్లాలో ఓ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డికి అక్కడ మంచి పట్టు ఉంది. అక్కడ వైసీపీ నుంచి గెలిచిన రాజంద్రనాథ్రెడ్డి విజయంలో ఆయన కీ రోల్ పోషించారు. ఇక ఇటీవల రాజేంద్రనాథ్రెడ్డికి ఆయనకు అస్సలు పొసగడం లేదు.
తన రాజకీయ భవిష్యత్తుపై అనుచర వర్గంతో చర్చించారు. ఈ చర్చల్లో టీడీపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు డోన్లో ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంపై నుంచి డిప్యూటీ సీఎం ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. దాదాపు గంటపాటు ర్యాలీ పాత బస్టాండు వరకు జరిగింది. ర్యాలీలో కేఈ, ఎంఎస్ఆర్ టీషర్టులను కార్యకర్తలు ధరించారు. భారీ పసుపు జెండాలతో ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, రెండు వేల మంది ప్రజలు టీడీపీలో చేరారు.