తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో కీలక నాయకుల నియోజకవర్గాల్లో అనేక మార్పులు జరిగిపోయాయి. తమకు బలమైన, బాగా పట్టున్న ప్రాంతాలు వేరే జిల్లాకు వెళ్లిపోయాయి. దీంతో నాయకులు కొత్త నియోజకవర్గాలు వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గాల వెతుకులాటలో పడ్డారు.
ప్రస్తుతం టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త నియోజకవర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచి పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ముఖ్యంగా కల్వకుర్తి నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై నాయకులతో మంతనాలు జరుపుతున్నారట.
కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వికారాబాద్ జిల్లాలోకి, మరికొన్ని మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. దీంతో కొడంగల్లో టీఆర్ఎస్ జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గం మారాలని భావిస్తున్నారట. మహబూబ్నగర్లో రేవంత్కు బలమైన క్యాడర్ ఉంది. కాబట్టి ఆయన నాగర్ కర్నూల్లోని కల్వకుర్తిపై దృష్టిసారించారని ప్రచారం జోరందుకుంది, ఇక్కడ టీడీపీకి పట్టు ఉండటంతో.. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నారట.
2019ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే నియోజకవర్గాలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. టీటీడీ తరఫున పెద్దగా నాయకులు కూడా లేకపోవడంతో.. పార్టీకి తానే అన్నీ అయి వ్యవహరించవచ్చు. దీంతో గెలుపు తన ఖాయమను కుంటున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఇప్పటి నుంచే సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యేగా వంశీచంద్ రెడ్డి ఉన్నారు. ఆయన తప్పితే ఇతర పార్టీ నాయకులు ఎవరూ లేరు. దీంతో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.
ఒకవేళ కల్వకుర్తి కానిపక్షంలో మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ్పేట్ నుంచి కూడా పోటీచేయాలనే అంశంపై యోచిస్తున్నారట. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.. టీఆర్ఎస్లో చేరారు. ఆయన వెళ్లినా.. టీడీపీకి సపోర్ట్ మాత్రం తగ్గలేదు. కాబట్టి నారాయణ్ పేట్ కూడా తనకు కలిసివస్తుందని రేవంత్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే!!