నవ్యాంధ్ర కొత్తగా విడిపోయిన రాష్ట్రం. రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినప్పుడు అనేక సమస్యలు, ఎన్నో అప్పులతో ఇక్కడ కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. కేంద్రం మనకు ఇచ్చిన ప్రత్యేక హోదా ప్యాకేజీతో పాటు, కేంద్రం ప్రకటించిన అంశాలను అమలు చేయించేందుకు ఢిల్లీలో ఏపీకి ఓ ప్రతినిధి అవసరమయ్యారు. చాలా రాష్ట్రాలు ఇలా తమ ప్రతినిధులుగా ఢిల్లీలో ఒకరిని నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అయిన కంభంపాటి రామ్మోహన్రావును ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ఎంపీ వేణుగోపాలా చారిని తమ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఇప్పటకీ వేణుగోపాలాచారి అక్కడ కొనసాగుతుండగా కంభంపాటి మాత్రం ఖాళీగా ఉన్నారు. ఆయనకు ఇచ్చిన రెండేళ్ల పదవీ కాలం ముగిశాక కొనసాగింపు ఇవ్వకపోవడమే దీనికి కారణం.
కంభంపాటికి ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీలో మంచి లాబీయిస్ట్. అయితే గతంలో సుజనాచౌదరి రాజ్యసభ రెన్యువల్ విషయంలో అడ్డు తగిలారన్న టాక్ ఉంది. దానిని మనస్సులో పెట్టుకున్న సుజనా కేంద్రంలో పనులు తాను మరో మంత్రి అశోక్ చేయించుకు వస్తామని..ఇక మనకు అక్కడ ప్రత్యేక ప్రతినిధి అవసరం ఏముందని చెప్పి కంభంపాటి ప్రత్యేక ప్రతినిధి పోస్టును పీకేయించారన్న ప్రచారం తెలిసిందే.
పదవి లేకున్నా కంభంపాటి తరచూ ఢిల్లీలో తను చేయగలిగింది చేస్తూనే ఉన్నారని టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందట. అయితే ఆయన మాత్రం రాజ్యసభ తప్ప తాను మరేమి తీసుకోనని చంద్రబాబుకు తేల్చి చెప్పారట. తిరుపతిలో హీరో హౌండా విభాగంరావడం వెనక కూడా కంభంపాటిదే ప్రధాన పాత్ర అట. ఏదేమైనా సుజనా దెబ్బకు కంభంపాటి ఖాళీ అయిపోయారు. మళ్లీ తిరిగి ఆయన ఓ వెలుగు ఎప్పుడు వెలుగుతారో చూడాలి.