ఏపీ క్యాబినెట్ విస్తరణ అంశం దాదాపు గత యేడాది కాలంగా ఊరిస్తూ..ఊరిస్తూ వస్తోంది. ఈ ఊరింపుకు త్వరలోనే ఓ ముగింపు రానుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ విస్తరణకు ఓ వ్యక్తి బ్రేకులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్రక్షాళనలో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటాయని…ఇది ఓ థ్రిల్లర్ మూవీని తలపించడం ఖాయమన్న టాక్ నడుస్తోంది.
విస్తరణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో పాటు జంపింగ్ జపాంగ్లకు చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జంపింగ్ జపాంగ్లకు చోటు కల్పించవద్దని గవర్నర్ బాబుకు సీరియస్గా చెప్పారట. అదే జరిగితే జంపింగ్ కోటాలో మంత్రి పదవి రేసులో ఉన్న జ్యోతుల నెహ్రూ – భూమా నాగిరెడ్డి – జలీల్ఖాన్ లాంటి వాళ్లకు మంత్రి పదవులు రానట్టే.
ఇక తూర్పు గోదావరిలో జ్యోతులకు ఛాన్స్ రాకపోతే సీనియర్ నాయకుడు – మాజీ మంత్రి, రాజోలు నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇక్కడ జ్యోతులకు ముందుగానే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన్ను బుజ్జగించేందుకు ఆయన కుమారుడికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందట.
ఇక గొల్లపల్లితో పాటు తాజాగా ఎమ్మెల్సీ అయిన డొక్కా పేరు కూడా రేసులో ఉంది. అదే జరిగితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పీతల సుజాతతో పాటు కాంట్రవర్సీ కింగ్ రావెల కిషోర్బాబు అవుట్ అయినట్టే. ఏదేమైనా బాబు త్వరగానే కేబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నా…జంపింగ్ జపాంగ్ల విషయంలో గవర్నర్ అడ్డు చెప్పడంతో ఇది మరికాస్త లేట్ అయ్యేలా ఉంది.