సమస్య ఎక్కడుంటే అక్కడుంటాన్న జనసేన అధినేతకు మా గ్రామాల్లోని ప్రజల సమస్యలు కనిపించడం లేదా? ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు…మా ప్రశ్నలు వినిపించడం లేదా? ఇవి పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామ మహిళల ప్రశ్నలు! మెగా ఆక్వాఫుడ్ ఏర్పాటుపై ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మహిళలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఇంత జరుగుతున్నా పవన్ స్పందిచకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పవన్ తమ తరఫున రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు. పవన్ వస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఇది. అక్కడ మెగా ఆక్వాఫుడ్ పార్క్ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని వల్ల దాదాపు 33 గ్రామాల ప్రజల జీవనానికి ఇబ్బంది పొంచి ఉందనీ, పార్క్ను వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు గుండె చించుకుని ఘోషిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే.. పవన్ ఒక ప్రత్యామ్నాయ మార్గంలా కనిపిస్తున్నాడు. ఈ సమస్య పవన్ దృష్టికి వెళ్లింది. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, అండగా ఉంటానని హామీ కూడా ఇచ్చాడు. కానీ మరోసారి ఆ గ్రామాల్లోని మహిళలపై పోలీసులు కర్కశంగా విరుచుకుపడ్డారు!
ఈ నేపథ్యంలో తుందుర్రు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వెంటా ఉంటానన్న పవన్ కల్యాణ్ ఎక్కడా అంటూ నిలదీస్తున్నారు. నిజమే కదా… తుందుర్రులో ఇంత జరుగుతుంటే పవన్కల్యాణ్ ఎక్కడ..? కనీసం ట్విట్టర్లో కూడా దీని గురించి స్పందించలేదే..? ఇదేనా పోరాటం అంటే..? ఇదేనా ప్రశ్నించడం అంటే..? ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ప్రజాసమస్యలపై పోరాటం చేస్తారా..? ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన స్పందించలేరా..? లేదంటే.. పవన్ కల్యాణ్ను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఏవైనా రాజకీయ శక్తులు ఒత్తిడి తెచ్చాయా..? అని తుందుర్రు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా దాగిఉన్న ఉద్దానం సమస్యను పవన్ ఒక్కసారి వెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగిపోయింది. సమస్య తీవ్రత తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే చేనేత రైతులు, విక్రమపురి వర్సిటీ విద్యార్థులు ఇలా అంతా పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు కూడా చేపడుతోంది. మరి తుందుర్రు గ్రామ ప్రజల కోసం పవన్ ఎలా ఉద్యమిస్తారో వేచిచూడాల్సిందే! ఇప్పుడు ఆ గ్రామాల భవిష్యత్తు పవన్ తీసుకునే నిర్ణయంతోనే ముడిపడి ఉంది. పవన్ స్పందనపై ప్రభుత్వం ఏవిధంగా రిసీవ్ చేసుకుంటుందన్నది కూడా ప్రశ్నే!!