క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. మరోసారి తానేంటో స్పష్టంచేశారు. క్రమశిక్షణ రహిత చర్యలకు పాల్పడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇద్దరు మంత్రుల పనితీరు పార్టీకి తలనొప్పిగా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించిన అయ్యన్నపాత్రుడు, జానీమూన్ వ్యవహారంలో రావెల కిశోర్బాబులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. తోక జాడించే వారి విషయంలో కత్తెరకు పని చెబుతానని కూడా ఓపెన్ గా చెప్పేశారట.
బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇష్టారాజ్యంగా చేస్తున్నపనుల గురించి ప్రస్తావించటమేగాక.. పార్టీని.. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే ఘటనల గురించి ప్రస్తావించి మరీ బాబు ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు రావెలతో పాటు అచ్చెన్నాయుడుకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారట.
వంశధార ప్రాజెక్టు విషయంలో ఆర్నెల్ల క్రితం అనుమతులు ఇస్తే.. వాటి అమలు గురించి నేతలు పట్టించుకోక పోవటం.. చివరకు వాటిపై రైతులు ఆందోళనలకు దిగి.. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునే వరకూ ఏం చేస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా తెలుస్తోంది. అలాగే గుంటూరు జిల్లాలో రావెలకు. జానీమూన్కు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే! దీంతో రావెలపై బాబు తీవ్రంగా ఫైర్ అయ్యారట. వారం రోజుల్లో తానో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా చెప్పేశారట,
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు చేపడతారో తెలియదు కానీ.. ఆల్రెడీ కొందరు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని బాబు ఫిక్స్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆ లిస్టులో రావెల కూడా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. కొద్ది రోజుల క్రితం తనను కలిసిన టీడీపీ శ్రేణులతోనూ రావెలపై ఊహించని చర్యలు ఉంటాయని లోకేశ్ చెప్పడంతో… ఆయన మంత్రి పదవి ఊస్టింగ్ ఖాయమని టీడీపీ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. అయితే తాజాగా ఈ జాబితాలోకి మంత్రి అచ్చెన్నాయుడు కూడా చేరిపోయాడని తెలుస్తోంది.