మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. దేశంలోనే కరడు గట్టిన గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ నాయుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తే.. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జి. వి. ప్రకాష్ స్వరాలు సమకూర్చాడు. అక్టోబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికై టైగర్ నాగేశ్వరరావుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల బయటకు వచ్చిన ట్రైలర్ తో ఆ అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ప్రమోషన్స్ కూడా త్వరలోనే ఊపందుకోబోతున్నాయి.
ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాను వినికిడి లోపం ఉన్నవారి కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్ణయించుకున్నారు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలైన మొదటి భారతీయ చిత్రం ఇదే. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అంతేకాదండోయ్.. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేయగా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా ఇది చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎవరూ ఈ ప్రయోగం చేయలేదు. టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో విడుదలైతే చరిత్ర సృష్టించినట్లు అవుతుంది అనడంలో సందేహం లేదు.