ప్రముఖ సీనియర్ నటి శ్రీవిద్య గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. 1953 జూలై 24న జన్మించిన ఈమె 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మెప్పించింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాత మనవడు సినిమా ద్వారా అరంగేట్రం చేసి తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో సహా 500 కు పైగా సినిమాలలో నటించి అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది.
ఒకానొక సమయంలో భారీ విజయాలను అందుకుంటూ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు తమిళ స్టార్ హీరో కమలహాసన్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి కొన్ని సినిమాలు కూడా చేశారు. అయితే అప్పటికే కమలహాసన్ వాణి గణపతి తో ప్రేమలో ఉండడంతో ఆమె ఆ బంధం నుంచి బయటకు వచ్చి దర్శకుడు భరతన్ తో ప్రేమాయణం కొనసాగించింది. అయితే ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జార్జ్ థామస్ ను ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే వీరిది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని జార్జ్ శరతు పెట్టడంతో వివాహానికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా నటించాలని అతడు బలవంతం పెట్టడంతో మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ అతడి వేధింపులకు తట్టుకోలేక 1980లో విడాకులు తీసుకొని అతడితో బంధానికి ముగింపు పలికింది. విడాకుల తర్వాత కూడా జార్జ్ శ్రీవిద్యను వదల్లేదని చెప్పాలి. ఆమె ఆస్తులు అన్ని తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరికి శ్రీవిద్య సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. ఇక జీవితాంతం ఏదో ఒక కష్టాలు కన్నీళ్ళతో గడిపిన ఈమె చివరికి బ్రెస్ట్ క్యాన్సర్ తో 2006 అక్టోబర్ 19వ తేదీన స్వర్గస్తురాలు అయ్యింది.