తెలంగాణ బిజేపిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బిఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బిజేపి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బిజేపికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది.
బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే 20 లోపు సీట్లలోనే బిజేపి బలం ఉంది..ఆ సీట్లలో ఎన్ని గెలుస్తుందో క్లారిటీ లేదు. పైగా అటు బిఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ బలపడింది. ఈ క్రమంలో కేసిఆర్ ని వ్యతిరేకించే నేతలు కాంగ్రెస్ వైపు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం వచ్చింది. వారిద్దరు బిజేపి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
పైగా వీరికి బండి సంజయ్ తో పొసగడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరిని..అమిత్ షా ఢిల్లీ పిలిచారు..పార్టీ పరిణామాలపై మాట్లాడారు. మీరు పార్టీని వదలొద్దు. మీ ప్రయోజనాలను అన్ని రకాలుగా చూసుకుంటాం’ అని షా వారికి మరోసారి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రస్తుతానికి బీజేపీలోనే ఉండి, జరగబోయే పరిణామాలను గమనించడానికి సిద్ధమయ్యారని తెలిపింది. తమకు ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదని అనుయాయులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కానీ ఎన్నికల సమయంలో మాత్రం వీరిద్దరు ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. బిజేపిలో ఉంటే గెలుస్తారేమో గాని..ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టం..దీంతో మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వస్తుంది. అదే కాంగ్రెస్ లోకి వెళితే.. ఆపార్టీ బలం పెరుగుతుందని..బిఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే శక్తి ఆ పార్టీకి ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి ఈటల-కోమటిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..అటు బండి పదవికి ఎసరు వస్తుందో లేదో.