వైసీపీ అధినేత జగన్ ఏపీలో ఏం చేసినా సంచలనం గా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా రాజధాని భూముల విషయంలోనూ ఆయన ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ అనేక సార్లు ఉద్యమాలకు పిలుపు కూడా ఇచ్చారు. బాబు తన మంత్రులను రాజీనామా చేయించాలని, ఎంపీలతో రాజీనామా చేయించాలని అనేక సందర్భాల్లో కేంద్రంలోపై కాలురువ్వారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జగన్ ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే.. దేశంలో రాష్ట్రపతి, ఉపష్ట్రపతి ఎన్నికల హడావుడి ముసురుకుంది. ఈ సమయంలో జగన్ అవసరం కేంద్రానికి ఎంతో ఉంది. అటు ఎమ్మెల్యుల, ఇటు ఎంపీల సంఖ్యలో జగన్ అవసరం ఎంతో ఉంది. ఈ సమయంలో ఎంతో బెట్టును ప్రదర్శించి రాష్ట్ర అవసరాలను తీర్చుకోవాల్సిన జగన్ ఒక్కసారిగా కేంద్రం బుట్టలో పడిపోయాడు. రాష్ట్ర పతి రామ్నాథ్ విషయంలో తమ మద్దతుపూర్తిగా ఉంటుందని అన్నారు. దళిత వ్యక్తి కాబట్టి మేం ఆయనకే మద్దతిస్తామని ప్రకటించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను నిలబెట్టే సరికి కూడా జగన్ ఇదే విధంగా ప్రవర్థించడం ఇక్కడ చర్చకు దారితీస్తోంది. నిజానికి వెంకయ్య జగన్ను అనేక సార్లు తిట్టిపోశారు. ప్రత్యేక హోదా విషయంలోనూ, రాజధాని భూముల విషయంలో నూ జగన్కి తలంటేశారు. అలాంటి వ్యక్తికి కూడా జగన్ ఇప్పుడు మద్దతివ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే, దీని వెనుక ఏదో విషయం దాగి ఉందని అంటున్నారు విశ్లేషకులు.
జగన్ ఇప్పటికే అనేక కేసుల్లో మునిగి పోయి ఉన్నాడని, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్నాడని ఈ సమయంలో కేంద్రాన్ని ఎదిరించి నిలచే సాహసం చేయలేడని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే జగన్ ప్రవర్థన ఉండడం గమనార్హం. ఏదేమైనా వెంకయ్య విషయంలో జగన్ ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని పలువురి సూచన. నిన్న మొన్నటి వరకు కేంద్రంపై బాబు ఫైట్ చేయడం లేదని, అందుకే రాష్ట్రానికి నిధులు, హోదా రావడం లేదని ఆరోపించిన జగన్ ఒక్కసారిగా ఇప్పుడు సరెండ్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.